చల్తే చల్తే మేరి యే బాత్ నహి భూల్నా ఖభీ అల్విదా నా కహెనా . . .

Monday, November 29, 2010

ఔరంగాబాద్ - ఎల్లోరా



మావారు పని వుంది నేను రాలేను , నువ్వే వెళ్ళి చూసిరా అన్నారు . ముందు ఒక్క దాన్నే తెలియని ప్లేస్ లో వెళ్ళేందుకు సంశయించాను . కాని ధైర్యే సాహసే లక్ష్మీ అనుకొని డ్రైవర్ బంటి గైడెన్స్ లో ఔరంగాబాద్ చూసేందుకు బయిలుదేరాను . ఔరంగాబాద్ లో ముస్లిం పాపులేషన్ ఎక్కువ . కట్టడాలు అవి ఎక్కువగా నవాబుల కల్చర్లోనే వున్నాయి . ఇక్కడ ముఖ్యం గా చూడవలసినవి , ' పంచక్కి ' , ' బీబీ - కా - మక్బారా ' , ' ఔరంగాబాద్ కేవ్స్ ' . ' పంచక్కి ' , ' ఔరంగాబాద్ గుహలు ' చూడలేకపోయాను .
1679 లో , ఔరంగజీబ్ తన భార్య ' రబియా - ఉద్ - దుర్రానీ ' జ్ఞాపకార్ధము కట్టించిన , ఆమె సమాధి . దీని ని తన తండ్రి షాజహాన్ , ఆగ్రా లో కట్టించిన ' తాజ్ మహల్ ' నమూనా లో కట్టించాడు . కాని అంత బాగా ఐతే లేదు :) తాజ్ మహల్ తో పోల్చకుండా చూస్తే బాగానే వుంటుంది . లోపల హాల్ లో రబియా ఉద్ దుర్రాని సమాధి వుంటుంది . నాలుగు పక్కలా పాలరాతి మీద చెక్కిన శిల్పాలు వున్నాయి . పైన డోం కూడా చక్కని నగిషీ పనితో వుంది . (' రాజుల సొమ్ము రాళ్ళపాలు ' అని నానుడి . ఈ మొగలు చక్రవర్తుల పుణ్యమా అని సమాధుల పాలు అయ్యాయి .)
అందులోనే ఓ పక్క గా హైదరాబాద్ నవాబు , ' నమాజ్ ' చేసుకునేందుకు ఒక పెద్ద హాల్ కట్టించాడు .

పైన ఫొటో లో వున్నటువంటి దర్వాజా లు ఔరంగాబాద్ లో ఏడువున్నాయట.

ఆ కమాన్ దాటి ముందుకు వెళ్ళగానే , పెద్ద మజీద్ వుంది . ఆ రోజు రంజాన్ మూలము గా అక్కడ చాలా రష్ గా వుండింది .



మరునాడు ఎల్లోరా చూద్దామని వెళ్ళాము . ఎల్లోరా కు వెళ్ళే దారి లోనే ' దౌలతాబాద్ కోట ' వస్తుంది . అది ఎక్కాలంటే నడిచి వెళ్ళాలసిందే ! అంత ఎత్తు ఎక్క లేక కింద నుంచే చూసి తృప్తి చెందాము :) అక్కడ అమ్ము తున్న జామకాయలు బహు పసందుగా వున్నాయి . వానలు వచ్చి నప్పుడు , అప్పుడప్పుడు ఆ చుట్టు పక్కల దొరుకుతాయని , కొన్ని నాణాలు చూపించారు . అవి అమ్ముతారట కూడా .

కొంచము ముందుకు వెళ్ళి , వూరి లోపలికి వెళుతే ఔరంగజీబు సమాధి వుంది . భార్య సమాధి ఎంత ఆడంబరము గా కట్టించాడో , ఆయన సమాధి , ఆయన జీవన విధానములా అంత నిరాడంబరము గా వుంది !



ఎల్లోరా గుహలు అనగానే , గుహల లోపలి కి వెళ్ళాలేమో నని ముందు భయపడ్డాను :) బంటి ని , పక్కవాళ్ళను అడిగి , గుహలు అంటే అంతర్ భాగం ఏమీ కాదని , చాలా వరకు ఓపెన్ ప్లేసే నని నిర్ధారించుకొని ముందడుగు వేసాను . ఐనా అక్కడి కివెళ్ళేవరకు , గుండెలు పీచు పీచు మంటూనే వున్నాయి . మరి అంత భయపడుతూ వెళ్ళటమెందుకయ్యా అంటే , ఇంత దూరం వచ్చి చూడకుండా వెళ్ళేందుకు మనసు ఒప్పదు . పైగా చూడకుండా వచ్చాను అంటే అందరూ నవ్వరూ ?

ఎల్లోరా గుహలు 500 - 700 ఏ .డి లలో నిర్మించినవి . మొత్తం 34 గుహలు వున్నాయి . అందులో 1 నుండి , 12 వరకు బౌద్ద మతమునకు , ఆ తరువాతి 16 హిందూ మతమునకు , 30 నుంచి 34 వరకు జైన మతమునకు సంబంధించినవి . అవి వారి వారి నమ్మకము ప్రకారము నిర్మించుకున్నారు . అన్ని గుహలూ ఒకే రోజు చూడాలంటే నాలాంటి ఓపికలేనివారికి కష్టమే ! కారు ఆగగానే ముందుగా 16 వ నంబర్ గుహ కనిపించింది . అది కైలాసము లా గా నిర్మించారు . హిందూ మతమునకు సంబంధించిన వాటిలో అన్నీ శివ పార్వతుల వే వున్నాయి . బుధ్ధుని ప్రతిమ వున్న గుహలో ఓ భౌద్ధ సన్యాసి ధ్యానము లో కనిపించాడు . అన్ని గుహలూ చూడలేము అంటే , అక్కడి గైడ్ , 5 , 10 , 15 , 16 , 21, 29 , 32 చూడమని సలహా ఇచ్చాడు . అంతవరకే చూడగలిగాము . కొండలను తొలిచి , అంత పెద్ద పెద్ద రాళ్ళను , అద్భుతమైన శిల్పాలుగా మలిచారు అంటే , చూసి తీరాల్సిందేకాని వర్ణింప నా తరమా ?



ఔరంగాబాద్ లో నాకు భోజనాని కి ఇబ్బంది కాలేదు . మేము వున్న ' లాడ్ లీ ' హోటల్ లో శాఖాహారము , అదీను వెల్లులిపాయ , మసాల లేకుండా శుభ్రము గా , రుచి గా వున్నది . అది నాకు చాలా విచిత్రము గా , సంతోషం గా అనిపించింది . హోటల్ రూం కూడా శుభ్రం గా వుంది . ధర కూడా ఎక్కువ లేదు . అందుకే వారము రోజులు హాయిగా వుండగలిగాను . వంట పని లేదు . చక్కగా బాలకనీ లో కూర్చొని నవల చదువుకుంటూ, ఆకలేసినప్పుడు బెల్ కొట్టి ఏదో వకటి తెప్పించుకొని తింటూ అహా ఏమి నా భాగ్యమూ అనుకుంటూ హాపిగా వారం గడిపేసాను . ఎంత హాపీ ఐనా ఇంటి కి తిరిగి రాక తప్పదుకదా :)

Thursday, November 25, 2010

కార్తీకమాసము లో హరిహరుల దర్శనం - నల్లగొండ , పానగల్లు , పిల్లలమర్రి



కార్తీక మాసం లో శివుని దర్శించుకొని , గుడి ప్రాంగణము లో దీపాలు వెలిగిస్తే చాలా పుణ్యం అంటారు . ఆ పుణ్యమేదో కాస్త సంపాదించుకుందామనుకొని , psm .లక్ష్మి గారు , మా అమ్మ , నేను , నల్లగొండ జిల్లా లోని కొన్ని పురాతనమైన శివాలయాలు దర్శించుకుందామని ఓ శుభోదయాన బయిలు దేరాము . psm.లక్ష్మి గారు , వాటిని ఇంతకు ముందు చూసి వుండటము వలన మాకు వాటి ప్రాశస్త్యము గురించి వివరము గా చెప్పారు .
ముందుగా , నల్లగొండ లోని , రామగిరి రామాలయాని కి వెళ్ళాము . అక్కడ శ్రీరామచంద్రుడు , సీతాదేవి , లక్ష్మణ , భరత , శతృగ్నలు , ఆంజనేయ స్వామి సహితము గా పట్టాబిషక్తుడైన పట్టాభిరాముని గా వెలిసాడు . హైదరాబాద్ నవాబు గారి భార్యకు నయము కాని జబ్బు రాగా , నల్లగొండ లో నున్న వక ఆయుర్వేదవైద్యుడు , ఆవిడ ముంజేతి కి పురికొస కట్టించి , ఆ పురికొస రెండో చివర సహాయముతో , బేగం గారి నాడి పరీక్షించి మందు ఇచ్చి , ఆ జబ్బును నయం చేసారట. అప్పుడు నవాబు గారు సంతసించి , ఆ వైద్యుని ఏమి కావాలో కోరుకోమంటే , తనకు స్వప్న ములో కనిపించిన , పట్టాభిరాముని ఆలయ నిర్మాణము కొరకు భూమి అడిగాడట . నవాబు ఇచ్చిన స్తలము లో ,ఆలయమును నిర్మించి , కాపరాల గుట్ట కింద భూస్తాపితం ఐన విగ్రహాలను వెలికితీసి ఈ ఆలయము లో ప్రతిష్టించారట . ఇది 400 సంవత్సరాల పురాతనమైన ఆలయము అని అక్కడి పూజారులు చెప్పారు . శ్రీరామచంద్రుని దర్శించుకున్న తరువాత , గుడి వెనకవైపు వున్న ఉసిరిక చెట్టు కింద దీపాలను వెలిగించుకొన్నాము .


పచ్చలసోమేశ్వరుడు -పానగల్లు


నల్లగొండ కుదగ్గర లోనే వున్న , పానగల్లు లో పచ్చలసోమేశ్వరలయాము ను , కాకతీయ రాజులకు సామంతులైన కందూరు చోళ రాజులు క్రీ. శ. 11 - 12 శతాబ్దం లో నిర్మించారు . ఈ దేవాలయము కింద ఇంకోక శివాలయము వుందని , దానికి బంగారు తలుపులు వున్నాయని , కాని కాలక్రమములో భూమిలోపలికి వుండిపోయిందని , అక్కడి పూజారిణి చెప్పింది . శివుని ఎడమ వైపున రాజరాజేశ్వరీ దేవి , ఎదురుగా నందీసుడు , నందీసుని కి ఎదురుగా వినాయకుడు కొలువై వున్నారు . శివును ఎదురుగా దీపాలను వెలిగించాము . పూజారిణి వాటిని లింగము ఎదురుగా వుంచింది .
పక్కనే వున్న రాజరాజేశ్వరీ దేవి కి పసుపుకుంకుమ సమర్పించాము . అమ్మవారు పవళించివున్న శివుని మీద హాయిగా కూర్చొని వున్నారు . ఇలా ఏ దేవాలయము లోనూ చూడలేదు .
వినాయకుని దగ్గర కూడా దీపాలు వెలిగించుకున్నాము .
మండపము లోని నంది , స్తంబాలు చక్కని శిల్పకళ తో వున్నాయి . ఆలయము బయట కూడా విరగగొట్టి పడవేసిన శిల్పాలు చాలా వున్నాయి . వాటిని చూస్తుంటే ఎంత బాధ కలిగిందో చెప్పలేను .

చాయాసోమేశ్వరుడు




పచ్చలసోమేశ్వరుని దగ్గర నుండి , అక్కడికి దగ్గరలోనే పొలాలలో కొలువైన చాయాసోమేశ్వరుని దర్షించుకోవటానికి వెళ్ళాము . అక్కడ , శివలింగము వెనుక వైపు ఓ స్తంబము లా నీడ వుంటుంది . ఆ నీడ ఎక్కడినుంచి వస్తోందో ఇంతవరకు , ఎవరూ కనిపెట్టలేక పోయారట ! ఆ నీడ వుండటము వలననే చాయాసోమేశ్వరుడు అని పేరు వచ్చిందట . ఆ నీడ కెమేరాకు కూడా చిక్కలేదు !
మా నాన్నగారు , నల్లగొండ లోనే చదువుకున్నారు . నాగార్జునసాగర్ కెనాల్ లో పని చేసేటప్పుడు , దాని తో పాటే నల్లగొండ వరకూ వచ్చారు . ఆ సమయములో మా అమ్మ , నాన్నగారు , చాయాసోమేశుని చాలాసారులు దర్శించుకున్నారట . మా అమ్మ ఆ సంగతులన్నీ తలుచుకుంది .

చాయాసోశ్వర దేవాలయము లోని నీడ గురించి న సమాచారము ఇక్కడ వుంది . ఈ లింక్ ఇచ్చిన ఆవకాయ గారు థాంక్స్ అండి .
ఆ ఈశుని పూజించుకున్న తరువాత , అక్కడే కూర్చొని , మేము తెచ్చుకున్న పులిహోర , పెరుగన్నం తిన్నాము :)

ఉదయసముద్రము



పానగల్లుకు ఉత్తరాన , ఉదయ చోడుడు ప్రజల అవసరార్ధం 11 వ శతాబ్ధం లో చెరువును తవ్వించాదు . అది ఈ రోజు కూ ప్రజల అవసరాలను తీరుస్తూనే వుంది . కాసేపు ఆ చెరువు గట్టున , ఆ చెరువు అందాన్ని ఆస్వాదిస్తూ తిరిగాము .

పిల్లలమర్రి



నల్లగొండ నుండి హైద్రాబాద్ కు వచ్చే దారి లో , సూర్యాపేట కు దగ్గర లో వుంది , పిల్లలమర్రి . మేన్ రోడ్ నుండి పక్కకు వెళ్ళాలి . ఆ తిరిగే ముందు , మేన్ రోడ్ లో నున్న ధాభా లో వేడి వేడి అలూ బజ్జీలు , చిక్కని కాఫీ ఇప్పించారు లక్ష్మి గారు .
పిల్లలమర్రి లో నామేశ్వరాలయం , ముక్తేశ్వరాలయం , ఎరకేశ్వరాలయం అని మూడు శివాలయాలు , చెన్నకేశవస్వామి దేవాలయము వున్నాయి . ముందుగా వూరి మొదట్లో వున్న నామేశ్వరాలయము నకు వెళ్ళాము . సాయంకాలము ఆరు కూడా కాకుండానే పూజారి గుడి తలుపులు మూసివేసి వెళ్ళిపోయాడు . అక్కడే వున్న పిల్లలు వెళ్ళి ఆయనను పిలుచుకొని వచ్చారు ! శీతాకాలపు పొద్దు . త్వరగా చీకటి పడిపోయింది . గుడి లో సరైన దీపాలు కూడా లేవు . ఆలయమును కాకతీయ రాజులు నిర్మించారు అని మటుకే చెప్పగలిగారు పూజారి ! మండపము లోని స్తంబాలు అద్భుతమైన శిల్పకళ తో వున్నాయి . ప్రతి స్తంబమూ , మీటితే , సప్తరాగాలను పలికిస్తోంది . స్తంబాలను ఒక్కొక్క చోట కొట్టి చూపించాడు పూజారి , అదీనూ లక్ష్మి గారు అడుగుతే ! స్తంబాల మీద శిల్పాలు ఎంత నాజూకుగా వున్నాయంటే , వాటిలో నుంచి సన్నటి దారము దూర్చవచ్చు. అదీ లక్ష్మి గారు అడుగుతే చూపించారు !
చెన్నకేశవస్వామి దేవాలయము మూసివేసారు . లో చాలా చీకటి గా వుండింది . ముక్తేశ్వరాలయము లో దీపాలు సరిగ్గా లేవు . చాలా చీకటి గా వుండినది . స్వామి ని దర్శించుకొని వచ్చేసాము . ఎరకేశ్వరాలయము లో ఆ మాత్రము కూడా దీపాలు లేక పోవటము వలన చూడలేక పోయాము .పక్కగా బ్రహ్మ , సరస్వతి ల విగ్రహాలు వున్నాయట . కాని చీకటి మూలము గా చూడలేక పోయాము .
కవి పిల్లలమర్రి చినవీరభద్రుడు ఈ వూరి వాడే నా అన్నదానికి ఎవరూ సమాధానము చెప్పలేకపోయారు . చిన్న వూరు . వచ్చేవారు లేరు . ఇక శ్రద్ధ ఎవరికి వుంటుంది ? లక్ష్మి గారు , ఇదివరకు చూసి వున్నందువలన మమ్మలిని తీసుకెళ్ళ గలిగారు . ఆవిడ చెప్పేవరకూ అక్కడ సప్తరాగాలు పలికించే స్తంబాలు వున్నాయని నాకు తెలీదు . ఇప్పటి వరకూ ఒక హంపీ లోనే వున్నాయనుకున్నాను , ఇలా చిన్న చిన్న వూళ్ళ లో మనకు తెలియని అద్భుతాలు ఇంకెన్ని వున్నాయో కదా అనుకున్నాను .


మేము మా కార్ లోనే , పొద్దున 6 గంటలకు బయిలుదేరాము . లంచ్ , స్నాక్స్ , కాఫీ పాక్ చేసుకొని వెళ్ళాము . అన్నీ తిరిగి చూసుకొని వచ్చేసరికి , రాత్రి 11 అయ్యింది . మాకు ఆ రోజు పొద్దున సిటీ ఔట్ స్కర్ట్స్ లో ట్రాఫిక్ మూలంగా ఆలశ్యం అయ్యింది . అందుకే తిరిగి రావటాని కి ఆలశ్యం అయ్యింది .

నల్లగొండ రామాలయము ఉదయము 11 గంటలకే మూసేస్తారు . ఇక్కడ పూజారి వుంటాడు . మనకు కావలసిన పూజ చేయించుకోవచ్చు . అందువల్ల ఆ సమయానికల్లా అక్కడి కి చేరుకునేటట్లు ప్లాన్ చేసుకుంటే చాలు . చాయాసోమేశ్వరాలయము లో పూజారి వుండడు , తలుపులు వుండవు .పూజరి పొద్దున్నే వచ్చి వెళ్ళిపోతాడట. ఇక్కడ మనమే పూజ చేసుకోవచ్చు . పచ్చలసొమేశుని దగ్గర గుడి మూసినా , కట కటా లలో నుండి చూడవచ్చు . ఇహ పిల్లలమర్రి కే కొంచం పొద్దు వుండగా వెళితే మంచిది . అక్కడ ఈశ్వరాలయము లో స్తంబాలను పరిశీలనగా చూడవచ్చు .


. లక్ష్మి గారు , కార్తీకమాసము లో ఇంత మంచి శివాలయాలను చూపించినందుకు మీకు చాలా ధన్యవాదాలండి .