చల్తే చల్తే మేరి యే బాత్ నహి భూల్నా ఖభీ అల్విదా నా కహెనా . . .

Monday, April 18, 2011

అహోబిలం - మహానంది





















" ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం ,
నృసిమ్హం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్య్హం :"
యాగంటి నుండి అహోబిలం బయిలుదేరాము . కొంచము దూరము వెళ్ళగానే దారి తప్పినట్లుగా అనిపించింది . అడుగుదామన్నా అక్కడ ఎవరూ లేరు ! కొంత సేపటి కి మోటర్ సైకిల్ మీద ఇద్దరు అబ్బాయిలు వచ్చారు . వారిని ఆపి దారి అడిగాము . దాదాపు 10 కిలో మీటర్లు వెనకకి వెళ్ళాలసి వచ్చింది ! అహోబిలము దగ్గరికి చేరుకునేసరి కి చీకటైయ్యింది . అహోబిల చేరాలంటే దగ్గర దగ్గర 14 గు కిలో మీటర్లు అడవి గుండా వెళ్ళాలి . దారి లో అక్కడక్కడ మినుకు మినుకు మంటూ దీపాలు , చిన్న వూళ్ళు తప్ప ఎక్కువగా మనుషులెవరూ కనిపించలేదు . చీకటి ( 7 గంటల కే చిమ్మ చీకటైంది . అదేమిటో ) , నిశబ్ధం నాకైతే చాలా భయం వేసింది . లక్ష్మిగారు , అమ్మ , డ్రైవర్ మల్లేశ్ బాగానే వున్నారు .నేనొక్కదాన్నే భయపడ్డది :) మొత్తానికి అహోబిలం చేరుకున్నాము . అప్పటికే కొండమీద దేవాలయము మూసేసారు . కింద దేవాలయము " శయనోత్సవం " సేవ కోసం పరదా వేసారు . అది పూర్తి అయ్యే వరకు అక్కడే నిలబడ్డాము . సేవ ఐన తరువాత పాలు తీర్ధం గా ఇచ్చారు . స్వామి వారిని దర్శించుకొని బయటకు వచ్చాము .
దేవాలయాని కి దగ్గర లోనే వున్న " హరిత " రెస్టారెంట్ లో భోజనము చేసి తిరుగు ముఖం పట్టాము . రోజు ఉదయము నాకు కొంచము ఆరోగ్యము సరిగ్గా అనిపించలేదు . అందుకని అహోబిలం కాన్సిల్ చేసుకొని మహానంది మాత్రము చూసేసి తిరిగి వెళుదామన్నాను . ఏమికాదు వెళుదామని , అమ్మ , లక్ష్మిగారు ధైర్యం చెప్పారు . బయిలుదేరటము లోనే ఆలశ్యం కావటము తో చౌడేశ్వరి అమ్మవారి దగ్గర , యాగంటి లోనూ ఆలశ్యమై అహోబిలానికి వెళ్ళేసరికి దేవాలయము మూసే సమయము అయ్యింది . నేను రాను అన్నాననేమో , మళ్ళీ రమ్మని లక్ష్మినృసిమ్హ స్వామి సరిగ్గా దర్శనం ఇవ్వలేదు !

* * * * * * * * * * * * * * * * * * * * * ** * * * * * * * * * * * * *

మా మూడు రోజుల యాత్ర లో మూడో రోజు ఉదయమే " మహానంది " వెళ్ళాము . ఇది " శ్రీ శైలం " దక్షిన ద్వారము లోని క్షేత్రాల లో వొకటి . దీనికి చుట్టుప్రక్కల నవ నందీశ్వరాలయాలు వున్నాయి . ఇక్కడ శివలింగము కిద నుండి ఎప్పుడూ నీరు ప్రవహిస్తూ వుంటుంది . నీటిని మూడు కుండాల నుండి నంది నోటి గుండా నీరు బయటకు వెళ్ళేట్లుగా ఏర్పాటు చేసారు . మనము ఆలయము లోనికి ప్రవేశించగానే స్వచ్చమైన నీటితో రుద్ర కుండము అగుపడుతుంది . ఇక్కడి నుంచి తూముల గుండా నీరు బయటకు వచ్చి , ప్రధాన ద్వారము దాటగానే వున్న బ్రహ్మ , విష్ణు కుండాలను చేరుకుంటుంది . కుండాలలో నీరు చాలా స్వచ్చము గా వుండి , కింద వున్న చేపలు , నేల కూడా అగుపడుతుంది . వీటిలలో భక్తులు స్నానము చేస్తారు . నీటిలో స్నానము చేస్తే చర్మ వ్యాదులు పోతాయి అంటారు .
మహానంది లోని శివలింగము స్వయంభూ లింగము . పూర్వము ఒక గొల్ల వాని దగ్గర వున్న పెద్ద ఆవు , అడివిలో చొట పాలూ జార్చి ఒట్టి పొదుగుతో ఇంటికి వచ్చేది . ఒక రోజు కాపరి ఆవును అనుసరించి వెళ్ళి చూస్తాడు . ఆవు పాలు వదిలిన పచ్చగడ్డి కింద ఓక పుట్ట వుంటుంది . పుట్ట నుంచి ఒక అబ్బాయి బయటకు వచ్చి ఆవు వదిలిన పాలను తాగి , మళ్ళీ పుట్టలోనికి వెళ్ళిపోతాడు . సంగతి రాజ్యము రాజుకు తెలుస్తుంది . అదేదో చూద్దామని రాజు అక్కడి కి వచ్చి చూస్తూవుండగా చప్పుడుకు ఆవు భయపడి పరిగెడుతుంది . అప్పుడు దాని గిట్ట పుట్టమీద పడుతుంది . రాత్రి రాజుకు కలలో శివుడు అగుపించి నువ్వు చూసిన బాలుడిని నేనే . పుట్టను పూజించి దేవాలయము కట్టించమని చెపుతాడు . ఉదయమే రాజు పుట్ట దగ్గరికి వెళ్ళి చూడగా పుట్ట శివలింగము గా మారి వుంటుంది . లింగము మీద ఆవు గిట్ట దిగబడిన గుర్తు వుంటుంది . ఇప్పుడు కూడా గర్భ గుడిలోని శివలింగము మీద ఆవు గిట్ట గుర్తు చూడవచ్చు .
స్వామివారి గర్భ గుడి పక్కనే , కామేశ్వరీ దేవి గర్భగుడి ఉంటుంది . అక్కడ మేము కుంకుమార్చన చేసుకున్నాము . దేవాలయము లోకి ప్రవేశించే ద్వారము దగ్గర వున్న నవగ్రహాలకు నూనె దీపాలను వెలిగించాము .
మద్యాహ్నము 12 కల్లా నంద్యాల కు వచ్చి , అక్కడే భోజము చేసి , హైదరాబాదుకు తిరిగి బయలుదేరాము . సాయంకాలము 6 కల్లా హైదరాబాద్ చేరుకున్నాము .

Sunday, April 10, 2011

నందివరం - యాగంటి



జోగుళాంబను , బాల బ్రహ్మేశ్వరస్వామి ని దర్శించుకున్న తరువాత , అక్కడే వున్న కరివెళ్ళవారి సత్రములో భోజనము చేసి , జోగుళాంబ దర్శనము బాగా జరిగింది అన్న సంతృప్తి తో నంద్యాలకు బయలు దేరాము . సాయంకాలానికి నంద్యాల చేరాము . బస్ స్టాప్ కు దగ్గర లో వున్న శశిహోటల్ లో రూం తీసుకొన్నాము . ఫ్రెషప్ అయ్యాక హోటల్ కు దగ్గరలోనే వున్న శివాలయము ను , సాయిబాబా మందిరము ను దర్శించుకున్నాము .



మరునాడు ఉదయమే యాగంటి బయిలుదేరాము . యాగంటికి వెళ్ళే దారి లో "నందివరం " దగ్గర ఆగాము . ఇక్కడ " చౌడేశ్వరీ దేవి " ఆలయము చాలా ప్రశిద్ది పొందినది. నందవరమును పూర్వము నందనచక్రవర్తి పాలించేవాడు . ఆయన దత్తాత్రేయును ఉపాసకుడు .దత్తాత్రేయుని గురించి తపస్సు చేసి స్వామివారిని మెప్పించి , ప్రతిరోజూ కాశీ క్షేత్రమునకు వెళ్ళి , గంగా స్నానం చేసి , విశాలాక్షి అమ్మవారిని సేవించేందుకు మంత్రపాదుకలను పొందాడు . వాటి వలన రోజూ తెల్లవారకముందే కాశీ కి వెళ్ళి అమ్మవారిని సేవించి వచ్చేవాడు . అదంతా తెలియని రాణి మీరు అంత వెకువననే ఎక్కడికి వెళుతున్నారు అని చక్రవర్తిని అడిగింది . అప్పుడు ఆయనకు విషయము చెప్పక తప్పలేదు . రాణి తను కూడా వస్తానని పట్టుపట్టటము తో రాణీ ని కూడా వెంట తీసుకొనివెళ్ళాడు . పవిత్ర గంగా స్నానం , అమ్మవారి దర్శనం అయిన తరువాత రాణి కి ఋతుక్రమము రావటమువలన , మంత్రపాదుకల శక్తి నశిస్తుంది .వారు రాజ్య వెళ్ళే మార్గము కోసమని అక్కడే ఉన్న కాశీ బ్రాహ్మణులను సహాయము చేయమి వేడుకున్నారు . బ్రాహ్మణులు మంత్ర శక్తి చే వారిని , వారి రాజ్యానికి చేరుస్తారు . అప్పుడు రాజు మీకేమి కావాలో కోరుకోమంటాడు . వారు సమయము వచ్చినప్పుడు అడుగుతామంటారు . కొంతకాలము తరువాత కాశీ లో కరువు వస్తుంది . అప్పుడు బ్రాహ్మణులు నందవరము వచ్చి సహాయము అడుగుతారు . రాజు వారెవరో తనకు తెలీదని , ఒకవేళ వారికి తను వాగ్ధానము చేసినట్లైతే , దానికి ఎవరితోనైనా సాక్ష్యము చెప్పించమంటాడు . బ్రాహ్మణులు విశాలాక్షి అమ్మవారిని సాక్ష్యము చెప్పేందుకు తీసుకొని వస్తారు . అప్పుడు రాజు ఆమె ను శరణు వేడి , అమ్మవారిని అక్కడకు పిలిపించటము కోసమే తను వాగ్ధానము మర్చినట్లు నటించానని , అమ్మవారిని అక్కడే వుండమని వేడుకుంటాడు . చక్రవర్తి కోరిక తో అక్కడ వెలిసిన అమ్మవారే చౌడేశ్వరీ దేవి .
ఆలయము వెనుక భాగము లో ఉళందర వృక్షము వుంది . వృక్షము అమ్మవారితో పాటు వచ్చిందట . అక్కడ కూడా భక్తులు పూజలు చేసి , ముడుపులు కట్టుతారు . ఆలయము ఒక పక్కగా అమ్మవారి పాదాలు వున్నాయి . చౌడేశ్వరదేవి కి మీసాలు వుండటము ఇక్కడి ప్రత్యేకత . చౌడేశ్వరీ అమ్మవారు మమ్మలిని తొందరగా వెళ్ళి పోనీయలేదు . గంట పైగానే అమ్మ వారి దగ్గర గర్భగుడి ముందు అమ్మవారిని కనులారా చూస్తూ కూర్చున్నాము .




అక్కడి నుంచి " యాగంటి " చేరుకునే సరికి గుడి మూసివేసే సమయము అయ్యింది . అందుకని అక్కడే వున్న అన్నదాన సత్రము లో భోజనము చేసి 2 గంటలకు గుడి తలుపులు తీసేవరకు విశ్రాంతి తీసుకున్నాము . చుట్టూ కొండలు పెద్ద పెద్ద చెట్లతో అక్కడి ప్రదేశము చాలా బాగుంది . అగస్త్య మహాముని తన దక్షిణ దేశ యాత్రలో ప్రదేశములో కొన్ని రోజులు తపస్సు చేసారట . అప్పుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్టించతలిచి విగ్రహము తయారు చేయించారట . మరునాడు విగ్రహ ప్రతిష్ఠ అనగా విగ్రహము పాదమునకు బొటన వేలు లేదని గమనించారట . ఎలాగా అనుకుంటు వుండగా మహేశ్వరుడు అగస్త్యునికి కనిపించి , ఇది నాకు ఇష్టమైన ప్రదేశము , కాబట్టి ఇక్కడ నన్ను ప్రతిష్ఠించమని చెప్పాడట . అప్పుడు అగస్త్యుడు పార్వతి తో సహా వెలుస్తేనే ప్రతిష్ఠిస్తానని అంగా , ఉమాదేవి తో సహా ఈశ్వరుడు ఇక్కడ వెలిసాడు . ఇక్కడి శివలింగము మీద ఉమా మహేశ్వరుల వదనాలు వుంటాయి .అలా ఇంకే శివలింగము మీద వుండదు .

ఇక్కడి నంది విగ్రహము పెరుగుతూ వుండటము ఇక్కడి ప్రత్యేకత .80/90 సంవత్సరాల క్రితము నంది చుట్టూ ప్రదక్షణలు చేసేందుకు వీలుగా వుండేదిట . ఇప్పుడు నాలుగు స్తంబాలకు ఆనుకొని ప్రదక్షణకు వీలుగాలేదు . కలియుగాంతమునకు నందీశ్వరుడు లేచి రంకె వేస్తాడని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు కాలజ్ఞానము లో చెప్పారట . విగ్రహమును ఎక్కడో చేసి తెచ్చినట్లుగా లేదు . ఇక్కడే వెలిసినట్లు చిన్న పర్వతాకారములో వుంది .

ఇక్కడ మూడు గుహలు ఉన్నాయి . ఒకటి అగస్త్యమహాముని తపస్సు చేసింది . ఇంకొకటి వెంకటేశ్వర స్వామిని వుంచింది .మూడవ దానిలో వీరబ్రహ్మేంద్రస్వామి కొంతకాలము కాలజ్ఞానము రాసారంటారు .
ఇక్కడి కొలను లోని నీరు చాలా స్వచ్చం గా వుంటుంది . గుడి కి పైకి వెళ్ళేందుకు 60+ మెట్లు ఎక్కాలి ! అంతే కాదు ఇక్కడ తినేందుకు అరటిపళ్ళు కూడా కనిపించలేదు ! మంచినీళ్ళ బాటిల్స్ దగ్గర నుంచీ అన్నీ తీసుకొని వెళ్ళాలి . భోజన మంటే అక్కడి సత్రములోనే వుంది . మెట్లు ఎక్కాలి . ఇవన్ని చూసుకొని వెళితే చాల సుందరమైన ప్రదేశము "యాగంటి ".

Saturday, April 2, 2011

ఆలంపూర్



ఉదయము 7.30 కల్లా హైదరాబాద్ దాటాము , నేనూ , మా అమ్మా , లక్ష్మిగారు . షాద్నగర్ దాటాక టిఫినీలు కానిచ్చాము . 9.30 కల్లా బీచుపల్లి చేరుకున్నాము . కృష్ణ వడ్డున వున్న ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళాము . దేవాలయానికి ప్రత్యేకమైన చరిత్ర ఏమీ లేదుట . చాలా పెద్ద విగ్రహము . స్వామివారు కళకళ లాడిపోతున్నారు .చాలా మహిమ గల స్వామి అట . హనుమాన్ చాలీసా చదువుకొని , కాసేపు గుడి లో కూర్చొని మా ప్రయాణము తిరిగి మొదలుపెట్టాము .

దారిలో అక్కడక్కడ నీళ్ళ తో , ఎండిపోయిన కృష్ణ ను చూస్తే , ఇంకా ఎండాకాలము పూర్తిగా మొదలే అవలేదు , అప్పుడే కృష్ణమ్మ ఇలా ఐపోయిందే అని చాలా బాధ పడ్డాము .




అక్కడి నుంచి 11.30 వరకు ఆలంపూర్ చేరాము . మేము వెళ్ళేసరికి పూట చివరి కుంకుమార్చన కు టికెట్స్ ఇస్తున్నారు . మేము టికెట్స్ తీసుకొని ఆలయము లోకి వెళ్ళాము . అమ్మవారి దర్శనము , కుంకుమార్చనా బాగా జరిగాయి . అందరూ వెళ్ళి తరువాత అక్కడి పూజారి మా కోరికపై అమ్మ వారి చరిత్ర చెపుతూ విగ్రహము చూపించారు .

ఆలంపూర్ లోని ' జోగుళాంబ ' అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవది . ప్రదేశము లో అమ్మవారి ముందు పళ్ళు పడ్డాయి . అందువలన అమ్మవారు నాలుక బయట పెట్టి చాలా ఉగ్రము గా వుంటారు . మేము పదిహేను సంవత్సరాల క్రితము వెళ్ళినప్పుడు అమ్మవారి , విగ్రహము , బాలబ్రహ్మేశ్వరుని ఆలయములో వుండేది . అప్పుడు , అమ్మవారిని నేరుగా చూడనివ్వలేదు . గోడకు వున్న కంత లో నుంచి చూసాము . ఇప్పుడు వున్న ఆలయము 1985 లో కొత్తగా కట్టారు . అక్కడ అమంవారి పాత విగ్రహము మును వుంచి , దాని ముందే కొత్తది , శాంతస్వరూపముతో స్తాపించారు . ఆలయము చుట్టూ నీటి కొలను వుంది . దాని వలన కూడా అమ్మవారు కొంత శాంతముగా వుంటారని చెప్పారు . అమ్మవారి జుట్టు మీద , బల్లి , తేలు , గబ్బిలము , మనిషి పుర్రె బొమ్మలు చిత్రించి వున్నాయి .

ఇక్కడ శక్తి పీఠమే కాకుండా , నవబ్రహ్మలు కూడా వున్నారు . బ్రహ్మ ఈశ్వరుని గురించి తపస్సు చేయగా , ఈశ్వరుడు ఆవు గిట్ట రూపము లో వెలిశాడు . చాలా చిన్న లింగాకారము కావటము తో ' బాల బ్రహ్మేశ్వర స్వామి ' అంటారు . 5 రూపాయల టికెట్ తీసుకుంటే గర్భ గుడి లో కి వెళ్ళి లింగము ను తాకి ప్రార్ధించుకోవచ్చు .
అమ్మవారి ద్వారపాలకులైన ' చండి , ముండి ' విగ్రహాలు ఇక్కడే వున్నాయి . కొత్త ఆలయము నిర్మించక ముందు అమ్మవారి విగ్రహము ఇక్కడే వుండేది .


ఇక చరిత్ర విషయాని కి వస్తే , ఇది తుంగ భద్ర , కృష్ణ నదుల మద్య ప్రదేశము లో వున్నది . ఆలంపుర సీమ , దక్షిణకాశి , భాస్కర క్షేత్రము , పరుశురామ క్షేత్రము , శ్రీశైల పశ్చిమ ద్వారము అని కూడా అంటారు .
దక్కను ప్రాతాన్ని పరిపాలించిన బాదామీ చాళుక్యులు , రాష్ట్రకూటులు , కళ్యాణీ చాళుక్యులు , కాలచుర్యులు , కాకతీయులు , తెలుగు చోళులు , విజయనగర రాజులు మహా క్షెత్రాన్ని సేవించారు. ఇది 14, 15 శతాబ్ధములలో బహమనీ సుల్తానుల దాడి కి గురి ఐనది .

మహాద్వారము దగ్గర అలీ పహిల్వానుకు ఒక దర్గా వున్నది . దానిని ' ధడ్ ముబారక్ ' అంటారట .
ఇంతవరకు లభించిన ఆధారాల బట్టి శ్రీ శంకరుల శ్రీ చక్ర ప్రతిష్ఠ11 శతాబ్ధ శాసనము , 13 శతాబ్ధములోని రస రత్నాకర ఆనందకందముల వ్రాతల వల్ల జోగుళాంబ ప్రాచీనాలయాలు 7 శతాబ్ధము లో నిర్మించింట్లు గా తెలుస్తోంది .
క్షేత్ర దైవమైన శ్రీ బ్రహ్మేశ్వర స్వామి శ్రీశైలం పాజెక్టు మునకలో నిర్మూలము కాకుండా రక్షించుకున్నాడు అంటారు .

" మహాదేవీం , మహాకాళీం , మహాలక్ష్మీం , సరస్వతీం !
త్రిశక్తి రూపిణీం అంబాం , జోగుళాంబాం నమామ్యహం !!"