చల్తే చల్తే మేరి యే బాత్ నహి భూల్నా ఖభీ అల్విదా నా కహెనా . . .

Thursday, October 25, 2012

నల్లపోచమ్మ - యూసుఫ్ గూడ









యూసుఫ్ గూడా బస్తీ కీ ముత్యాలమ్మ తల్లి గ్రామ దేవత అట .ఈ అమ్మవారు ఎప్పుడు ఎలా వెలిసిందో , ఈ చిన్న గుడి ఎవరు ఎప్పుడు కట్టించారో నేను అడిగినవాళ్ళు ఎవరూ చెప్పలేకపోయారు . మా కాలనీ లో వున్న సీతమ్మగారు 20 సంవత్సరాల క్రితము వాళ్ళు ఇక్కడి కి వచ్చేసరికే ఈ గుడి వుంది అన్నారు . ఇక్కడ ఆ రోజులలో ఎక్కువగా బలులు ఇచ్చేవారట.





13 సంవత్సరాల క్రితం యన్. జనార్ధన రెడ్డి గారు , ముత్యాలమ్మ గుడి కి పక్కనే ఓ గుడి కట్టించి అందులో నల్లపోచమ్మను స్థాపించారట. ఈ గుడి లో బలులు ఇవ్వరట. అమ్మవారు చాలా కళగా వుంటుంది . చాలా మహిమ కలది అని కూడా అంటారు . 11 సంవత్సరాల నుంచి సీతమ్మగారి ఆధ్వర్యం లో , మా కాలనీ ఆడవారు  ఇక్కడ రోజూ సాయంకాలము, లలితా సహస్రనామాలు పారాయణ చేస్తున్నారు .మధ్య మధ్య భారతము , భగవద్గీత , రామాయణము కూడా పారాయణ చేసారట . రామాయణము పారాయణ చేసి నంత కాలమూ ఓ కోతి అక్కడకు వచ్చి , పక్కనే గోడ మీద కూర్చునేదట . రామాయణ పారాయణము అయ్యాక రాలేదట !

అలాగే జయలక్ష్మి అనే ఆవిడ 9 సంవత్సరాల క్రితం ఇటువైపు ఇల్లు కట్టు కొని వచ్చారట . వకరోజు రాత్రి కలలో , ఏదో గుడి , అక్కడ అందరూ ఏదో చదువుతున్నట్లుగా కల వచ్చిందిట. ఆవిడ అంత పట్టించుకోలేదట. మరునాడు రాత్రి మళ్ళీ ఆ గుడి స్పష్టంగా కనిపించిందిట. అమ్మవారి ముందు ఏదో రాయిలాగా కూడా కనిపించిందట .  మరునాడు సాయంకాలం ఆ గుడి ఈ చుట్టుపక్కల ఏమైనా వుందా అని వెతుక్కుంటూ వస్తే ఈ గుడి కనిపించిందిట. అప్పుడే అక్కడ కొంతమంది ఆడవాళ్ళు లలితా సహస్రనామ పారాయణ చేస్తున్నారుట . ఆ గుడి , గుడి లోని అమ్మవారు , అమ్మవారి ముంది శిల అంతా కలలో కనిపించినట్లే వుందిట . ఆ రోజు నుంచి ఆవిడా ఆ బృదం లో చేరి రోజూ లలిత చదువుతున్నారట . ఇంచు మించు ఇలాంటి అనుభవమే నాకూ కలిగింది . పదిరోజుల క్రితం నేనూ ఏదో గుడిలో లలిత పారాయణ చేస్తునట్లుగా కల వచ్చింది . ఏ గుడా , ఎక్కడా అని నేనూ కొంచం ఆలోచనలో పడ్డాను . పొద్దున పూజ చేసుకొని , వచ్చి కూర్చోగానే , అక్కడే ఊడుస్తున్న మా పనమ్మాయి , అమ్మా దసరా పదిరోజులూ నల్లపోచమ్మ గుడి లో బాగా చేస్తారమ్మా . పక్కనే షెడ్ లో పెద్ద అమ్మవారి విగ్రహం పెడుతున్నారు . సీతమ్మ వాళ్ళు రోజూ వెళ్ళి ఏదో చదివి వస్తారు అన్నది . వెంటనే సీతమ్మగారి దగ్గర కు వెళ్ళి ఎన్నిటి కి వెళతారో తెలుసుకొని రమ్మని పంపించాను . రోజూ పది నిమిషాల తక్కువ ఐదుకు వెళుతారుట నిన్ను అప్పటికల్లా రమ్మన్నది తీసుకెళుతానన్నది అని చెప్పింది . ఆ విధం గా అమ్మవారు నన్నూ పిలిపించుకుంది . ఈ పది రోజులూ అమ్మవారి ముందు కూర్చొని లలితా పారాయణ చేయగానే ఎంతో మనశ్సాంతిగా , హృదయం తేలికపడ్డట్టుగా అనిపించింది .























ఈ పదిరోజులూ ఉత్సవాలు చాలా బాగా జరిగాయి . రోజూ ఉదయమూ , సాయంకాలమూ లలితా సహస్రనామపారాయణము జరిగింది . అందులో మా కాలనీ ఆడవారే  కాకుండా చుట్టు పక్కల బస్తీ వాళ్ళు కూడా ఎంతో శ్రద్ధ గా చేసారు . ఆరో రోజు సుహాసినీ పూజ , ముగ్గురు ముత్తైదువులకు , ఓ బాల కు చేసారు . ఒక రోజు అన్నదానం జరిగింది . ఏడోరోజు హోమం చేసారు . నిన్న విజయదశమి రోజు లలిత పారాయణ అయ్యాక అమ్మవారి ని కదిలించారు . ఈ తొమ్మిదిరోజులూ అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజించారు.



Tuesday, April 3, 2012

చిలుకూరు బాలాజీ


రంగారెడ్డి జిల్లాలో వుంది "చిలుకూరు " . ఇక్కడ వెలిసిన "బాలాజీ" , వీసా బాలాజీ గా చాలా ప్రసిద్ది . అమెరికాకు విసా కావాలనుకున్నవారు ఈ బాలాజీ ని తప్పక దర్శించుకుంటారు .

చాలాకాలం క్రితం చిలుకూరులో ఒక గొప్ప వెంకటేశ్వరస్వామి భక్తుడు 'గుణాల మాధవ రెడ్డి ' వుండేవాడు .ప్రతి ఏటా పంట చేతికి రాగానే తిరుపతి వెళ్ళేవాడు .చేలో పండిన ధాన్యం కొంత స్వామికి అర్పించేవాడు . స్వామికి కళాయణోత్సవం చేయించేవాడు . తిరుపతి వెకటేశ్వరుడంటే ఆయనకు ప్రఘాడమైన భక్తి .కొన్నాళ్ళకు ఆ భక్తుడు ముసలివాడైనాడు . తిరుపతి ప్రయాణం తట్టుకునే స్తితిలో లేడు . అతడు చాలా బెంగపడ్డాడు . స్వామిని దర్శించుకోలేకపోయానేనని దిగులు పడి, ఆలోచించి ఆలోచించి నిద్రపోయిన ఆరాత్రి , ఎవరో తట్టి లేపుతున్నట్లుగా అనిపించి లేచి కూర్చున్నాడు . కళ్ళుతెరిచి చూడగానే శ్రీదేవి , భూదేవి సహితం గా వెంకటేశ్వర స్వామి కనిపించి "తాతా నువ్వు రాలేవని నేనే వచ్చేసాను " అని చెప్పాడు . " ఇకనుంచి నీ కొరకు ఇక్కడ వెలుస్తాను . నీ చేలో వున్న శివలింగానికి దక్షణం వైపు వున్న ఒక పాముపుట్ట అడుగున నేను వున్నాను . ఇంతవరకు భూగర్భం లో వున్నాను . ఇక పైన నీలాంటి భక్తులకు దర్శనం ఇవ్వ తలుచుకున్నాను .నీ చేలో నేను చెప్పిన చోట తవ్వి చూడు . శ్రీదేవి , భూదేవి ల తో సహా ఒకే రాతిమీద వెంకటేశ్వరుని రూపం లో నీకు దర్శనం ఇస్తాను " అని చెప్పాడు .
సృహలోకి వచ్చిన మాధవరెడ్డి , తన మనవల సహాయముతో , తన పొలం లో వున్న పుట్టను వెతికి త్రవ్వగా , గడ్డపారకు రక్తపు మరకలు కనిపించటం తో భయపడిన మాధవరెడ్డి పాల తో పుట్టను కరిగించాడు .పుట్ట కరిగిపోయి ఏక శిలలో వెంకటేశ్వరుడు , అలివేలుమంగ , పద్మావతి కనిపించింది . అదే చోట మాధవరెడ్డి గుడి నిర్మించాడు .స్వామి మూలవిరాట్టుకు ఎడమవైపు పైభాగము ,చాతి దగ్గర గడ్డపారతో గాయమైన గుర్తులు నేటికీ కనిపిస్తాయి .

ఈ గర్భ గుడి చుట్టూ పదకొండు ప్రదక్షణాలు చేసినవారికి కోరిక తీరుతుందని భక్తుల విశ్వాసము . కోరిక తీరిన తరువాత 108 ప్రదక్షణాలు చేయాలి .

ఈ ఆలయం లో హుండీ లేదు . అర్జితం టికెట్లు లేవు . ప్రత్యేక దర్శన టికెట్లు లేవు . ఎంతటివారైనా సామాన్యుల తోపాటు క్యూ లో రావలసిందే !

మేము అనుకోకుండా పోయిన శనివారం చిలుకూరు వెళ్ళాము . రష్ చాలానే వుంది . ఐనా సులభంగానే దర్శనం అయ్యింది .కాకపోతే స్వామి దగ్గర లైట్ లేదు . చీకటిగా వుంది . అందుచేత స్వామి సరిగ్గా కనిపించలేదు . కనిపించినంతవరకు తృప్తిగా చూసాము . జరగండి జరగండి అనే తోపులాటలు లేవు !

ఈ గుడి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి వుంటుంది .